శ్రీరాంపై కుట్ర, జగన్ పార్టీ నేతల హస్తం: పరిటాల సునీత
శ్రీరామ్ను కుట్ర పూరితంగా ఇతర పార్టీల నేతలు ఇరికించారన్నారు. సుధాకర రెడ్డి వర్గం గతంలో ముగ్గురిని హతమార్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా సుధాకర్ రెడ్డితో తమకు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో మహిళా కానిస్టేబుళ్లు లేకుండా సోదాలు చేశారని, అలా చేయడం సరికాదని, దీనిపై తాను స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కాగా సోదాలు సమయంలో బుధవారం సునీత మండిపడ్డ విషయం తెలిసిందే. అనుమతి లేకుండా సోదాలు చేయడాన్ని ఆమె ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా సోదాలు నిర్వహించడం సరికాదన్నారు. తన భర్త పరిటాల రవి హత్యకు ముందు ఇలాగే ఇంట్లో సోదాలు చేశారని ఆమె గుర్తు చేశారు. తన తనయుడు పరిటాల శ్రీరామ్ను కొందరు కావాలనే ఇరికించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
కాంగ్రెసు నేత హత్యకు కుట్ర కేసులో పోలీసులు విచారణ కోసం పిలిస్తే తన తనయుడిని తాను వెంట తీసుకొని వెళతానని చెప్పారు. అనుమతి లేకుండా చేస్తున్న సోదాలపై తాను స్పీకర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. తాను మహిళా ఎమ్మెల్యేని అని కూడా చూడకుండా తన ఇంట్లో సోదాలు నిర్వహించడమేమిటన్నారు.
తన ఇంట్లోనే కాకుండా తన మావయ్య ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారన్నారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందన్నారు. వారిని ఫాక్షన్ రాజకీయాలకు దూరంగా పెంచుతున్నానని, శ్రీరామ్ చదువుల కోసం విదేశాలకు వెళ్లే సమయంలో ఇలా చేస్తున్నారని, ఎస్పీతో మాట్లాడతామనుకున్నా ఆయన లైన్లోకి రావడం లేదన్నారు.