మా మాట వింటే: గ్యాంగ్రేప్పై సుప్రీం జడ్జి, ఓనర్ అరెస్టు

అత్యాచార ఘటన తర్వాత బస్సు నమోదు పత్రాల్లో పేర్కొన్న చిరునామా మేరకు యజమాని కోసం ఆరా తీయగా అది తప్పుడు చిరునామా అని తేలింది. దీంతో పోలీసులు ఓనర్ దినేష్ను నోయిడా సెక్టార్ 62లో అరెస్టు చేశారు. ఈయన తప్పుడు చిరునామాతో మరో పదకొండు బస్సులను కూడా ఇలా నమోదు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయనను పోలీసులు విచారించనున్నారు.
ఢిల్లీ రేప్ పైన సుప్రీం
వాహనాల కిటికీ అద్దాలకు ఉండే ఫిల్మ్లను, తెరలను తొలగించాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించి ఉంటే ఢిల్లీ అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదేమోనని సుప్రీం కోర్టు ప్రధా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అత్యాచార ఘటన జరిగిన బస్సు అద్దాలు పారదర్శకంగా ఉంటే... రోడ్డు మీద ఉన్న ప్రజలు బస్సులో జరుగుతున్నది చూసి అడ్డుకోవడానికి ప్రయత్నించే వారన్నారు. కొన్నిసార్లు మనం విధుల్లో విఫలమవుతామని, ఏదైనా చెడు జరిగినప్పుడు గానీ మేల్కొనమన్నారు.
నిర్భయ చట్టం
ఢిల్లీ బాధితురాలి తల్లిదండ్రులు సమ్మతిస్తే కేంద్రం తేనున్న చట్టాన్ని ఆమె అసలు పేరుతో రూపొందించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. కేంద్ర మంత్రి శశి థరూర్ తొలుత ఈ ప్రతిపాదన చేయగా, పలువురు నేతలు మద్దతు పలుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి దీనిపై అఖిలపక్ష భేటీ పెట్టాలన్నారు. అయితే, సవరణ చట్టానికి వ్యక్తుల పేరు పెట్టడం వీలు కాదని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
సవరణ చట్టాన్ని నిర్భయ-దామిని బిల్లుగా పిలవవచ్చునని ప్రముఖ న్యాయవాది అయిన కాంగ్రెస్ ఎంపి అభిషేక్ సింఘ్వి సూచించారు. లేదంటే ఢిల్లీలో ఘోర ఉదంతం జరిగిన మార్గాన్ని ఈ పేరుతో పిలవాలని అభిప్రాయపడ్డారు. అలాగే ఆమె పేరు పెడితే తమకేమీ అభ్యంతరం లేదని, దాన్నొక గౌరవంగా భావిస్తామని యువతి తండ్రి, సోదరుడు బుధవారం యూపీలోని బలియాలో చెప్పారు. దీనివల్ల తమ ఇంటి ఆడపడుచు పేరు లోకానికి వెల్లడైనా ఫర్వాలేదన్నారు. అదే సమయంలో ఆమెకు పెళ్లి నిశ్చయమైనట్లు లోగడ వచ్చిన వార్తలను ఖండించారు. సవరణ చట్టంలో 14 ఏళ్లు పైబడిన నిందితులను పెద్దవాళ్లుగానే పరిగణించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
అత్యాచార కేసుల విచారణకు మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అంశంపై దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. మహిళ రక్షణపై వచ్చిన మరో పిల్ను కూడా పరిగణనలోకి తీసుకుంది. వీటిపై నెలలోగా స్పందించాల్సిందిగా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ అయ్యాయి. చీఫ్ జస్టిస్ అల్తమాస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనంతో పాటు జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ల ధర్మాసనం వీటిని జారీచేశాయి.
విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రమీలా శంకర్, లాయర్ ముకుల్ కుమార్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఓ గ్యాంగ్రేప్ నిందితులకు బెయిల్పై స్పందన తెలపాల్సిందిగా జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలేల ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, నిర్భయ ధైర్యసాహసాలకు గుర్తింపుగా 'అశోకచక్ర' పురస్కారం ప్రకటించాలని బిజెపి కోరింది.












Click it and Unblock the Notifications