అక్బర్! నీది ఏదేశం?: జగ్గారెడ్డి, కిరణ్ నీరోచక్రవర్తి: కిషన్
నీరోలా ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీరో చక్రవర్తిలా తయారయ్యారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో అన్నారు. అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకొని ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
అంతకుముందు బిజెపి ప్రతినిధుల బృందం గవర్నర్ నరసింహన్ను కలిసింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల సిడిని ఆయనకు అందజేశారు. మతసామరస్యం దెబ్బతినేలా మజ్లిస్ నేత వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ నరసింహన్ను కోరారు.
అక్బరుద్దీన్ పైన మరో కేసు
ఢిల్లీలో ఒక కేసు, హైదరాబాదులో రెండు కేసులు అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదయ్యాయి. శుక్రవారం మరో కేసు నమోదయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో కేసు నమోదయింది. జిల్లాకు చెందిన ఈశ్వర్ యాదవ్ అనే వ్యక్తి అక్బరుద్దీన్ సమావేశాలలో హిందూ ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.