హత్య కుట్ర కేసులో పరిటాల శ్రీరామ్: స్పీకర్కు ఫిర్యాదు

పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా తన ఇంట్లో తనిఖీలు నిర్వహించారని, కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా సోదాలు చేపట్టారని ఆమె స్పీకర్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యయత్నం కుట్ర కేసులో తన తనయుడు పరిటాల శ్రీరామ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ విషయాన్ని స్వయంగా కామిరెడ్డిపల్లే పలుమార్లు చెప్పారని అన్నారు. తమకు, ఆయన కుటుంబానికి ఎలాంటి శత్రుత్వం లేదని ఆమె అన్నారు. కేవలం తన తనయుడిని ఇరికించేందుకే ఇలా చేస్తున్నారన్నారు.
కాగా దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ ఈ నెల 7వ తేదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే కేసులో పరిటాల శ్రీరామ్ ఎ-14 నిందితుడిగా ఉన్నాడు. దీనిపై పరిటాల లాయర్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణను కోర్టు 7వ తేదికి వాయిదా వేసింది.
పరిటాల శ్రీరామ్ కోసం రెండు రోజులుగా పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం పరిటాల స్వగ్రామం అయిన వెంకటాపురంలో, బంధువుల ఇళ్లలో, అనుచరులు ఇళ్లలో.. అంతటా పోలీసులు పరిటాల శ్రీరామ్ కోసం గాలిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు గురువారం నాడు మరింత ముమ్మరం చేశారు. కర్నాటకలో శ్రీరామ్ ఉన్నాడనే సమాచారం పోలీసులకు వచ్చింది.
దీంతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనంతపురం సరిహద్దులో ఉన్న కర్నాటకలోనూ పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు. ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదయింది. నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పరిటాల శ్రీరామ్తో సహా మరో పదకొండు మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి కోసం మూడు బృందాలు రంగంలో ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పరిటాల శ్రీరామ్ను ఎఫ్ఐఆర్లో ఎ-14 నిందితుడిగా, నాగూర్ హుస్సేన్ను ఎ-15 నిందితుడిగా పేర్కొన్నారు.
సుధాకర్ హత్యకు పది లక్షల సుపారీ చేతులు మారినట్లుగా కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్ విదేశాలకు వెళతాడనే సమాచారం రావడంతో పోలీసులు అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కారణంగా బెయిల్ వచ్చే వరకు శ్రీరామ్ అజ్ఞాతంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications