జగన్ బెయిల్ 22కు: ధర్మాన ప్రాసిక్యూషన్ తీర్పు 21కి
ప్రాసిక్యూషన్ పైన వాదనలు పూర్తి
మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న సిబిఐ పిటిషన్ పైన న్యాయస్థానంలో శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. సిబిఐ పిటిషన్ పైన తీర్పును న్యాయస్థానం ఈ నెల 21వ తేదికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్కు అవసరం లేదన్న ఈ కేసు విచారణ నిమిత్తం ధర్మాన ప్రసాద రావు కోర్టుకు హాజరయ్యారు.
హైకోర్టుకు సిబిఐ నివేదిక
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో హైకోర్టుకు సిబిఐ నివేదికను సమర్పించింది. కేసుకు సంబంధించిన పురోగతిని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. సీల్డు కవర్లో సిబిఐ నివేదిక అందజేసింది.
శ్రీలక్ష్మికి గడువు
26 జివోల కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు శ్రీలక్ష్మికి, ఎస్వీ ప్రసాద్కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రెండు వారాల గడువును ఇచ్చింది. మరోవైపు మంత్రులు, ఐఏఎస్ అధికారుల కౌంటర్ పైన వివరణ ఇచ్చేందుకు పిటిషనర్కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. పిటిషనర్ సుధాకర్ రెడ్డి గడువు కోరడంతో కోర్టు అంగీకరించింది. ప్రతివాదులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేర్చాలని పిటిషనర్ కోర్టును కోరారు. దానిని కోర్టు తోసిపుచ్చింది. నేరం జరగడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ జివోలు ఉల్లంఘన జరిగిందని ఎలా చెప్పగలరని అడిగింది.