నియోజకవర్గాలకు బాలయ్య రెడీ: 14న పుంగనూరుకు!
నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో బాలయ్య సమక్షంలో పలువురు కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు రామకృష్ణా రెడ్డి విగ్రహాన్ని కూడా బాలయ్య ఆవిష్కరించనున్నారు. బాలయ్య రాక కోసం నియోజకవర్గ పార్టీ వర్గం ఇప్పటి నుండి సమాయత్తమవుతోంది.
కాగా నెల రోజుల క్రితం బాలయ్య గుడివాడలో పర్యటించి వేడి పుట్టించిన విషయం తెలిసిందే. తమ పార్టీ అధినాయకత్వంపై కొందరు కారుకూతలు కూస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలు చేస్తే గట్టిగా బుద్ధి చెబుతామని అప్పుడు బాలకృష్ణ మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో పార్టీ నేత రావి వెంకటేశ్వర రావు ఇంట్లోని ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నేతలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించే వారిని తాను హెచ్చరిస్తున్నానని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్నారు. అధిష్టానంపై ఎవరో కారుకూతలు కూస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని రంగాలకు, వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీ ద్వారా ఎదిగి అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తారా అని నిప్పులు చెరిగారు.
గుడివాడ టిడిపి కంచుకోట అని, ఒకరు వెళ్లిపోయినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలు తిరిగి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించుకునేందుకు పాటుపడాలని కోరారు. పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. టిడిపి గుర్తుతో పదవి పొంది ఇప్పుడు విమర్శిస్తారా అని ఘాటుగా, ఒకింత ఆవేశంతో ప్రశ్నించారు.
కొందరు బూటకపు ప్రకటనలతో రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీని వీడాలనుకున్న వారు సైలెంట్గా వెళ్లి పోవచ్చునని చెప్పారు. తనకు కృష్ణా జిల్లా నుండి పోటీ చేయాలని ఉందని అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతానని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి బాలయ్య అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.