ఢిల్లీ రేప్: ఎపికి సాక్ష్యాలు, కోర్టులో లాయరుకు ఝలక్
కోర్టులో నిందితులు.. లాయర్లను అడ్డుకున్న న్యాయవాదులు
వైద్య విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం సాకేత్ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో నిందితులు రాంసింగ్, ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లను పోలీసులు జడ్జి ముందు హాజరుపర్చారు.
వారు చదివిన స్కూల్ పత్రాల ఆధారంగా ఆరో నిందితుడిని మైనర్గా గుర్తించి జూనైనల్ హోంలో ఉంచారు. ఆరో నిందితుడిని బాల నేరస్థుడిగా న్యాయస్థానం ముందు విచారణకు హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి వెయ్యి పేజీల ఛార్జీషీటును దాఖలు చేశారు.
దీనిని కోర్టు స్వీకరించింది. నిందితులపై అత్యాచారం, హత్యలతో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. కాగా ఈ రోజు నిందితులను కోర్టుకు పోలీసులు హాజరు పర్చిన తర్వాత వారి తరఫున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా న్యూఢిల్లీ అత్యాచార కేసు విచారణ అంశంపై మీడియా సంయమనం పాటించాలని సాకేత్ కోర్టు ఆదేశించింది.
మరోవైపు అత్యాచార ఘటన నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టిన సమయంలో కోర్టు హాలు కిక్కిరిసి పోయింది. దీంతో పోలీసులు ఇంతమంది ఉంటే నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. కోర్టులో నుండి కేసుకు సంబంధం లేనివారు వెళ్లిపోవాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కేసును రహస్యంగా విచారించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.