జగన్ ప్యాలెస్ను ఆస్పత్రిగా మార్చేస్తా: చంద్రబాబు
తండ్రిని అడ్డుపెట్టుకొని దోచిన డబ్బుతో హైదరాబాద్లో వైయస్ జగన్ 72 గదుల ప్యాలెస్ను నిర్మించుకున్నాడని, తాము అధికారంలోకి వస్తే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చివేస్తామని అన్నారు. బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకోవడం ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని అన్నారు.
ఎవరైనా పనులను శుభం జరగాలని గుడులుగోపురాల నుంచి ప్రారంభిస్తారని, జగన్ మాత్రం అన్ని పనులను జైలు నుంచే మొదలు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడు అనిల్కు కట్నం కింద లక్షా40వేల ఎకరాల బయ్యారం గనులను ఇచ్చారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తీరుపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ధర్మాన ప్రసాదరావును అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడంలో రూ.400 కోట్లు నొక్కేసాడని, సంబంధిత కాంట్రాక్టు కంపెనీలకు రూ.4వేల కోట్ల వరకు రాయితీలు ఇచ్చారని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.
ఒక కులానికి, మతానికి ఏ ఒక్క నాయకుడూ ప్రతినిధి కాదని ఆయన మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహారంపై పరోక్షంగా అన్నారు. మతాన్ని, కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదని అన్నారు. దీనివల్ల సమాజంలో అస్థిరత, అశాంతి చెలరేగి ప్రజలు ఇబ్బందులకు గురికావలసిన పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం ఏశారు. రాజకీయాల్లో మతోన్మాదం సరికాదని అన్నారు.