అప్పుడు అసద్తో డీలా.. ఇప్పుడు అక్బర్తో ఉత్సాహం!
గతంలో జూనియర్ డాక్టర్ పైన ఎమ్మెల్యే చేయి చేసుకోవడం, అధికారులను బెదిరించడం వంటి పలు ఆరోపణలు మజ్లిస్ పార్టీ నేతల పైన ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మజ్లిస్ నేతల పైన పలు కేసులు నమోదయ్యాయి. అయితే వాటిని ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోలేదని భారతీయ జనతా పార్టీ వంటి పార్టీతో సహా పలువురి ఆరోపణ. కాంగ్రెసు పార్టీతో మజ్లిస్ పార్టీ పద్నాలుగేళ్లు జత కట్టింది.
ఇటీవలే ఆ పార్టీ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అతనిపై కేసులు పెట్టడం, అరెస్టు చేయడం వరకు వెళ్లింది. అయితే అక్బరు పైన ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యల్లో కూరుకుపోయి అరెస్టు కావడం గమనార్హం. గతంలోనూ తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా మజ్లిస్ వ్యవహరించింది. అయితే ఆ తర్వాత టిడిపికి దూరమైన తర్వాత కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి అనుభవమే ఎదురయింది.
టిడిపి హయాంలో అసద్ అరెస్టయ్యారు. అదే రీతిలో ఇప్పుడు అక్బర్ కాంగ్రెసు హయాంలో ఆ పార్టీకి సవాల్ విసిరిన తర్వాత అరెస్టయ్యాడు. అయితే అసద్ అరెస్టు తర్వాత మజ్లిస్ పార్టీ తన దూకుడును తగ్గించింది. అదే సమయంలో ఆ పార్టీ అంతగా ప్రాచుర్యం కూడా పొందలేదు. కానీ ఇప్పుడు అక్బర్ అరెస్టును మాత్రం రాష్ట్రవ్యాప్తంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.