సీన్ రివర్స్: బాబుకు మోత్కుపల్లి దూరం, విమర్శలు
చంద్రబాబుపై ఆయన తాజాగా విమర్శలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. బ్లాక్ మెయిల్ చేసేవారిని చంద్రబాబు నెత్తికి ఎక్కించుకుంటున్నారని మోత్కుపల్లి చంద్రబాబుపై వ్యాఖ్యానించినట్లు కొన్ని తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. టీవీ చానెళ్ల వార్తాకథనాల ప్రకారం - తెలుగుదేశం పార్టీలో తనకు గౌరవమర్యాదలు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై తాను మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. గత కొంత కాలంగా చంద్రబాబుపై మోత్కుపల్లి అలిగినట్లు వార్తలు వస్తున్నాయి.
మోత్కుపల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు పార్టీ నాయకులను మధ్యవర్తులను పంపించారు. అయితే, మోత్కుపల్లి దిగిరాలేదు. దాంతో మోత్కుపల్లిని ఆయన మానానికి ఆయనను చంద్రబాబు వదిలేసినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుంటూ కెసిఆర్పై, ఆయన కుటుంబ సభ్యులపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయినా, తెలుగుదేశం పార్టీకి ఆయన దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ కార్యాచరణ విషయంలో మోత్కుపల్లి నర్సింహులు గతంలో పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుతో విభేదించారు. ఆ సమయంలో ఇరువురి మధ్య విభేదాలు పొడసూపి, అంతర్గత ఘర్షణ తలెత్తినప్పుడు చంద్రబాబు మోత్కుపల్లిని వెనకేసుకొచ్చారని అంటారు.