నిర్దోషిగా తిరిగొస్తా: టిడిపి ఎమ్మెల్యే, జైలు వద్ద ఉద్రిక్తత

మంగళవారం రాత్రి హైదరాబాదులో అరెస్టయిన యరపతినేని శ్రీనివాస రావును పోలీసులు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల న్యాయమూర్తి ఎదుయ హాజరుపర్చారు. న్యాయమూర్తి ఎమ్మెల్యేకు పద్నాలుగు రోజుల రిమాండు విధించారు. దీంతో అతనిని గుంటూరు జిల్లా సబ్ జైలుకు పోలీసులు తరలించారు. పున్నం నరెందర్ హత్య కేసులో యరపతినేని శ్రీనివాస రావు మూడో ముద్దాయిగా ఉన్నాడు.
యరపతినేని అరెస్టును నిరసిస్తూ పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు సబ్ జైలు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టిడిపి కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరిగింది. యరపతినేని అరెస్టుని నిరసిస్తూ టిడిపి ఈ రోజు గురజాల బందుకు పిలుపునిచ్చింది.
కాగా కాంగ్రెసు కార్యకర్త పున్నం నరేంద్ర హత్య కేసులో నిందితుడైన గుంటూరు జిల్లా గురజాల తెలుగుదేశం శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావును హైదరాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావు డిసెంబర్ 19 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ను నరసరావుపేట కోర్టు తిరస్కరించింది.
దీంతో ఆయన కోసం గురజాల డిఎస్పీ గిరిధర్ నేతృత్వంలో పోలీసు బృందాలు కొద్ది రోజులుగా గాలిస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వలవేసి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పిడుగురాళ్లకు తరలించారు. నరసరావుపేట కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఎమ్మెల్యే యరపతినేని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో 7వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ 9వ తేదీ బుధవారం విచారణకు రానుంది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే లోగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు వార్త తెలిసి పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండల కేంద్రాల్లో టిడిపి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం గురజాల నియోజకవర్గ బంద్కు తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు. హత్యకు గురైన నరేంద్ర తొలుత తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారు.
ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోకి మారారు. రియల్ ఎస్టేట్ వివాదాలు, క్రికెట్ బెట్టింగ్ల నేపథ్యం గల నరేంద్ర నవంబర్ 27న హత్యకు గురయ్యారు. తన అన్నను హత్య చేసేందుకు ఎమ్మెల్యే యరపతినేని కుట్ర పన్నారని నరేంద్ర సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను మూడో నిందితుడిగా చేర్చారు. గుంటూరు జిల్లా పల్నాడులోని గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ ప్రాంతం ఫాక్షన్ రాజకీయాలకు నిలయం. 1994లో తొలుత ఎమ్మెల్యేగా గెలుపొందారు.












Click it and Unblock the Notifications