పరిటాల శ్రీరామ్కు ముందస్తు బెయిల్: దొరకని ఆచూకీ
కాంగ్రెసు నేత సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారనే ఆరోపణపై శ్రీరామ్తో పాటు మరికొంత మందిపై అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోమవారం కూడా శ్రీరామ్ బెయిల్ పిటిషన్పై విచారణ సాగింది. కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది.
దీనిపై పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు పరిటాల శ్రీరామ్ కోసం వెతుకుతున్న పోలీసులు అతని ఆచూకిని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. శ్రీరామ్ అంశంపై ఆయన తల్లి, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత ఐదు రోజుల క్రితం స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమక్షంలో అమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికే తన భర్త పరిటాల రవీంద్ర మృతి చెందారని, కనీసం తనను, తన పిల్లల్ని అయినా ప్రశాంతంగా బతకనివ్వాలని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
అనుమతులు లేకుండా తన ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి పూట సోదాలు నిర్వహించారని, దీనిపై తాను స్పీకర్కు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మీడియాతో మాట్లాడారు.
ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ఎలా సోదాలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎస్పీని అడిగితే ఎమ్మెల్యేని అయిన తనకు కూడా ఏమాత్రం స్పందించలేదన్నారు. తన అబ్బాయి పరిటాల శ్రీరామ్ కేసు వివరాలను కూడా ఆయన చెప్పలేదన్నారు.గతంలో ఇళ్లు సోదాలు చేసి రవిని చంపారని, మరి ఇప్పుడు సోదాలు చేసి తనను చంపుతారా లేక తన పిల్లల్ని ఏమైనా చేస్తారా అనే భయం కలుగుతోందన్నారు.