20లోగా తెలంగాణపై నిర్ణయం: కెసిఆర్కు పిలుపు?
సోనియా గాంధీ నివాసంలో మంగళవారం కోర్ కమిటీ సభ్యులు జార్ఖండ్ పరిణామాలపై గవర్నర్ నివేదికపైనే కాకుండా తెలంగాణపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ఎకె ఆంటోనీ, చిదంబరం, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. కేరళ పర్యటనలో ఉన్నందున ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి రాలేదు.
కేరళలో జరిగిన ప్రవాసీ దివస్లో పాల్గొనేందుకు వెళ్లడం వల్ల వాయలార్ రవి, అనారోగ్యం కారణంగా గులాం నబీ ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొనలేదని తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని ఈ నెల 17వ తేదీలోగా తేల్చేసే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈలోగా ప్రకటించలేకపోతే రాజస్థాన్లోని జైపూర్లో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి) మేధోమథన సమావేశాల్లో తెలంగాణపై ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందని, ప్రకటన విధివిధానాలపై మరో రెండు కోర్ కమిటీ సమావేశాల్లో కసరత్తు పూర్తవుతుందని అంటున్నారు. తెలంగాణపై జరిగే చివరి సమావేశంలో రాహుల్ గాంధీని కూడా భాగస్వామిని చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం వివరాలను, చేయాల్సిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఈలోగా అధిష్టానం పెద్దలు చెప్పే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇటు తెలంగాణ నుంచి, అటు సీమాంధ్ర నుంచి విభజనపై నాయకులు అధిష్టాన వర్గానికి వినతిపత్రాలు అందిస్తున్నారు. వాటిని అన్నింటినీ అధిష్టానం పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో రహస్యంగా చర్చలు కూడా సాగిస్తున్నట్లు సమాచారం. నిర్ణయం ప్రకటించే వరకు ఏ విధమైన లీక్లు ఇవ్వకూడదని కూడా నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయని అంటున్నారు. అందుకే, జానారెడ్డి ఢిల్లీ భేటీలు బయటకు రాలేదని సమాచారం. మొత్తం మీద, తెలంగాణపై తేల్చడానికి కాంగ్రెసు అధిష్టానం పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది.