బాయ్ప్రెండ్తో తిరగాలా: ఎస్పీ ఎమ్మెల్యే, రాఖీసావంత్..
పరాయి మగాళ్ళతో కలిసి రాత్రిపూట తిరగవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పద్ధతి మారాల్సిన అవసరముందన్నారు. మహిళల వేషధారణ కారణంగా కూడా అత్యాచారాల సంఖ్య పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిని ఆపాల్సిన అవసరముందన్నారు. ఢిల్లీ ఉదంతం వంటివి జరగడానికి పాశ్చాత్య సంస్కృతే కారణమన్నారు. పొట్టి దుస్తులేసుకుని రెచ్చగొట్టేలా తిరగడమే రేప్లు పెరగడానికి దారి తీస్తోందన్నారు.
ఓ ఆడపిల్ల తన బాయ్ఫ్రెండ్తో హోటల్కు వెళుతుందని, అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. అప్పుడు ఏ గొడవా ఉందని కానీ, అదే అమ్మాయి బయటకొచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం బాయ్ఫ్రెండ్ను ఉరితీసేయాలా అని ప్రశ్నించారు. అవివాహితుల మధ్య లైంగిక సంబంధాలను చట్టవిరుద్ధమని ప్రకటించాలన్నారు. మోహన్ భగవత్ చెప్పినట్లు పట్టణాల్లోనే అత్యాచారాల సంఖ్య ఎక్కువ అన్నారు. ఎందుకంటే పట్టణ యువతుల్లాగా గ్రామీణ యువతులకు బాయ్ఫ్రెండ్లు ఉండరని చెప్పారు.
గ్రహగతులు సరిగా లేని మహిళలే అత్యాచారాలు, వేధింపులకు గురవుతున్నారని, వరుసబెట్టి జరుగుతున్న రేప్లకు ఇంతకన్నా ఏ సమాధానం చెప్పగలమని, నక్షత్రబలం సవ్యంగా లేకపోతే ఎవరికైనా ఏదో ఒక హాని తప్పదని, ఒక్క జ్యోతిష్కులు మాత్రమే ఇలాంటివి పసిగట్టగలరని ఛత్తీస్గఢ్ హోంమంత్రి నన్కిరామ్ కన్వర్ అన్నారు.
మోడలింగ్ చేసేవాళ్లు ఎంపీలైతే పార్లమెంటు ఫ్యాషన్ షోలా తయారవుతోందని, మలైకా అరోరా ఖాన్, రాఖీ సావంత్ వంటి వాళ్లు ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో కూర్చుంటే ఇక చట్టసభ నాశనమే అని గోవా ఎమ్మెల్యే విష్ణువాగ్ అన్నారు.
ఇక హర్యానాలోని హిసార్ పరిధిలోగల ఖేదర్ గ్రామంలో యువతులు జీన్స్, టి షర్టులు ధరించరాదని, మొబైల్ ఫోన్ వాడరాదని ఖాప్ పంచాయతీ హుకుం జారీ చేసింది. డిజె పార్టీ నిర్వహిస్తే రూ.11 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించింది. మద్యం మత్తులోనే రేప్లు ఎక్కువగా జరుగుతాయని సర్పంచ్ షంషేర్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఆజ్ఞల అమలు పర్యవేక్షణకు 11 మందితో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. అయితే, యువతరం ఈ హుకుంను వ్యతిరేకిస్తోంది.