సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై చిరంజీవి చిర్రుబుర్రులు
విద్యుత్ చార్జీల పెంపుతో పాటు, ఇతర కీలక నిర్ణయాలపై కిరణ్ తనను పట్టించుకోకుండా వ్యవహరించడం, తనతో వచ్చిన శాసనసభ్యులకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై చిరంజీవి తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కరెంటు చార్జీల పెంపు అంశంపై ముఖ్యమంత్రి తనను సంప్రదించకపోవడం బాధించిందని ఆయన అంటున్నారని సమాచారం.
చిరంజీవి ఆగ్రహమే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై మంత్రి సి.రామచంద్రయ్య ఇటీవల పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు రాసిన లేఖలో వ్యక్తమైందని అంటున్నారు. ఆ తర్వాత రామచంద్రయ్య లేఖను సమర్థిస్తూ చిరంజీవి మాట్లాడడం తన అసంతృప్తిని వ్యక్తం చేయడంలో భాగమని అంటున్నారు. చార్జీల పెంపు ప్రతిపాదన వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని, వాటిని ఉపసంహరించుకోవాల్సిందేనని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చార్జీల పెంపు ప్రతిపాదన ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందన్న ఆందోళన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తల్లో ఉందని వ్యాఖ్యానించారు.
సి రామచంద్రయ్య వ్యాఖ్యలను తెలిసీ, తెలియని మాటలుగా ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించడాన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డికి, చిరంజీవికి మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతోందని అంటున్నారు. కొండ్రు మురళిపై చిరంజీవి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం నుంచి వచ్చినవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదని, వారికి తగిన స్థానం కల్పించడం లేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీ పటిష్టత కోసం క్షేత్ర స్ధాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని, పార్టీ నిర్వహించే సమావేశాల్లో మాజీ ప్రజారాజ్యం పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వాలని తాను ఎన్ని సార్లు సూచించినా, స్పందన కరువైందని చిరంజీవి అంటున్నట్లు సమాచారం. మొత్తం మీద, లోలోన చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య సమరం నడుస్తున్నట్లే ఉందని వ్యాఖ్యానించారు.