ప్రైవేట్ జాబ్స్ చూసుకోండి, వాటికి ఎగబడొద్దు: సిఎం
విద్యారంగంలో పెను మార్పులు రానున్నాయని ఆయన అన్నారు. దేశంలో ఎలాంటి ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతుందో అలాంటి చదువులు చదువుకోవాలని, అటువంటి చదువులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
మీ సేవ ద్వారా మరో వంద సేవలను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెంచేందుకే మీ సేవను తీసుకువచ్చినట్లు తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వ సేవలను సామాన్యులకు అందించేందుకు ప్రభుత్వం సేవాహక్కు చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
శుక్రవారం ఉదయం సచివాలయంలో మీ సేవ డిజిటల్ డిసిప్లే బోర్డును ఆయన ప్రారంభించారు. ఈ చట్టం ద్వారా పౌరులకు ఉత్తమ సేవలు అందుతాయని చెప్పారు. నిర్లక్ష్యం వహించే అధికారులే దరఖాస్తు దారునికి జరిమానా చెల్లించే విధంగా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అవినీతి నిర్మూలన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహిస్తుందన్నారు. టెక్నాలజీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రయోజనమని సీఎం అన్నారు.
తర్వాత జూబ్లీహాలులో సాంకేతిక శాఖ నిర్వహించిన మీసేవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మీసేవ పరిధిలో కొత్తగా 16 సేవలు ప్రారంభించారు. మీసేవ ద్వారా మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. శుక్రవారం నుంచి ‘మీ సేవ'లో 52 సేవలు అందుబాటులో ఉండనున్నాయి.