పాకిస్తాన్లో 6 వరుస పేలుళ్లు: 116 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. బెలూచిస్తాన్, కైబర్-పక్తుంఖ్వా ప్రాంతంలోని స్వాత్లోయలో గురువారం ఆరు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 116 మంది వరకు మృతి చెందారు. మరో 235 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు దాడులు సున్ని ముస్లిం గ్రూపుకు చెందిన లష్కరే జాంగ్వి చేసినట్లుగా శుక్రవారం మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
మొదటి పేలుడు సౌత్ వెస్ట్ బెలూచిస్తాన్లోని ప్రధాన పట్టణమైన క్వెట్టాలో జరిగింది. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్లో ఉంటుంది. ఈ ఘటన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది. ఈ బాంబు పారామిలటరీ దళాల చెక్ పోస్టును దగ్ధం చేసింది. ఇక్కడ 12 మంది మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. దగ్గరలో ఉన్న ఓ వాహనంలో బాంబును పెట్టి పేల్చారు. ఇది 25 కిలోల బరువు ఉండవచ్చునని బాంబు నిర్వీర్య సిబ్బంది చెబుతోంది.

రెండు అడుగుల లోతు, ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో గుంత పడింది. దాదాపు 13 వరకు వాహనాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మరో ఐదు బాంబు దాడులు జరిగాయి. షియా వర్గం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అలందార్ రోడ్డులోని షియా ప్రార్థనా మందిరాలు ఉన్న ఓ స్నూకర్ క్లబ్బులో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం వరుసగా మరో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి.
ఇందులో మొదటి దాడి ఆత్మాహుతి దాడి. రెండో బ్లాస్టులో వంద కేజీల పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లుగా భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు తాము బాధ్యులమని ప్రకటించలేదు. ఈ దాడిని అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి రాజా పర్వేజ్ అష్రాఫ్లు తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications