స్నేహితుడని ఆదరిస్తే చంపాడు: ఎమ్మెల్యే ఉషా రోదన
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జీవన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దానిని చూసి ఆమె తట్టుకోలేకపోయారు. స్నేహితుడు అని ఆదరిస్తే తన కుమారుడినే పొట్టన పెట్టుకున్నాడని ఆమె రోదించారు. ఓ పథకం ప్రకారమే తన కుమారుడిని హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే రెండో కొడుకు అయిన జీవన్ మృతితో పాలకొల్లులో విషాదపు ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే నివాసానికి నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. జీవన్ను ఉషారాణి దంపతులు తన సోదరికి దత్తత ఇచ్చారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే ఉషారాణి కొడుకు జీవన్ గురువారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. జిల్లాలోని ఆలమూరు మండలంలోని మూలస్థానం వద్ద జీవన్ను అతని స్నేహితుడు వీరబాబు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు వీరబాబు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీసులకు లొంగిపోయాడు. అయితే, పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని చెబుతున్నారు. వీరబాబు, జీవన్ కారులో రాజమండ్రి నుంచి రావులపాలెం బయలుదేరారు. మూలస్థానం వద్దకు వచ్చిన తర్వాత వీరబాబు.. జీవన్ను కత్తితో పొడిచి శవాన్ని బయటకు తోసేశాడు. ఆ తర్వాత రావులపాలెం చేరుకుని పోలీసులకు కత్తితో సహా లొంగిపోయాడని సమాచారం. తమకు మూలస్థానం వద్ద శవం పడి ఉన్నట్లు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని, తాము వెళ్లి చూసి శవాన్ని గుర్తించామని పోలీసులు చెప్పారు.