కోమటిరెడ్డి వ్యాఖ్య: జానాకు కౌంటర్గా, ప్రత్యర్థిపై ఒత్తిడికి
కోమటిరెడ్డి సోదరులు(కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)లు వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కాంగ్రెసు పార్టీతో విభేదిస్తున్నారు. పార్టీలోనే ఉంటున్నప్పటికీ వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసమంటూ వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అదే జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పదవి వరించింది.
జిల్లా నేతలతో కోమటిరెడ్డి సోదరులకు పొసగడం లేదు. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి చిరంజీవిని జిల్లాకు తీసుకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. జిల్లా నేతలపై ఒత్తిడి తెచ్చేందుకే కోమటిరెడ్డి గులాబీ నేతతో కలిసినట్లుగా చెబుతున్నారు. 28లోగా తెలంగాణ ప్రకటనపై కాంగ్రెసు పార్టీ వెనక్కి పోయినట్లుగా కనిపిస్తుండటంతో జిల్లాకు చెందిన తెలంగాణవాదులకు తన ప్రత్యర్థులను టార్గెట్గా చేసే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన కలిశారంటున్నారు.
అదే జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి గురువారం మాట్లాడుతూ... కొందరు నేతలు సమైక్యవాదాన్ని సాకుగా చూపి పార్టీలు మారే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అది ఆయన అన్నది ప్రధానంగా కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించే అనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు తెలంగాణ ప్రకటనపై వెనక్కి పోవడంతో జానా, ఉత్తమ్ వంటి తన ప్రత్యర్థులను జిల్లాలో టార్గెట్ చేసే వ్యూహంలో భాగంగా ఆయన కలిసి ఉంటారని అంటున్నారు. తమకూ చీము నెత్తురు ఉన్నాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా వారికి సవాల్ విసిరినట్లుగా ఉందంటున్నారు.