కాలు నొప్పితో చంద్రబాబు: జగన్తో కుమ్మక్కంటూ ఫైర్
ఆ తర్వాత పల్లగిరి గ్రామంలో తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. నందిగామ పొలిమేర నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి నిలబడటంతో నొప్పిని దిగమింగుతూనే వారితో కరచాలనం చేశారు. నందిగామలో బహిరంగ సభ తర్వాత నొప్పి తీవ్రం కావటంతో వైద్యులు పరీక్షించి వేలు వాచినట్టు గుర్తించారు. గురువారంనాటి పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నందిగామ గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి లాలూచీ పడ్డారని ఆయన దుయ్యబట్టారు. జగన్ కేసులో ప్రభుత్వం సహకరించలేదని కోర్టుకు సిబిఐ విన్నవించుకునే పరిస్థితి వచ్చిందని, దీన్నిబట్టి కిరణ్ దొంగలను కాపాడటానికి ఎంతగా తంటాలు పడుతున్నాడో అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు ఒక్కటేనని, ఒకటి దోచుకునే పార్టీ అయితే, మరొకటి దాన్నంతా కప్పిపెట్టి కాపాడే పార్టీ అని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అవినీతిపరులు కలుపు మొక్కల్లా తయారయ్యారని, కలుపు మొక్కలు తీయకపోతే పంట చేతికి రాదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
గొర్రెలకు ఉన్న విశ్వాసం కూడా రాజకీయ నేతలలో ఉండటం లేదని, 30 ఏళ్లపాటు శ్రమించి నాయకులుగా తీర్చిదిద్ది ఎమ్మెల్యేలను చేస్తే సూట్కేసులకు అమ్ముడుపోతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం పేరిట ప్రజలకు పప్పు బెల్లాలు పంచి తన కొడుకు జగన్కు మాత్రం లక్ష కోట్లు దోచి పెట్టాడని ఆరోపించారు.