అప్పుడు రెండు కళ్లు, ఇప్పుడు ఇలా: బాబుపై బొత్స
శుక్రవారం రాజమండ్రిలో ఎంపి ఉండవల్లి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జై ఆంధ్ర ఉద్యమం జరిగి 40 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న సభకు తనను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినట్లు తెలిపారు. కొన్ని చారిత్రక వాస్తవాలను తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ సభకు హాజరయ్యానని చెప్పారు.
ఎంపి ఉండవల్లి ఆధారాలతో సహా వివరించిన వాస్తవాలను చూస్తుంటే అధికారం కోసం కొంతమంది నాయకులు ఎంత దారుణంగా ప్రవరిస్తున్నారో అర్ధమవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎప్పుడూ ఆలోచించదన్నారు. రాష్ట్రంలోని 9కోట్ల మంది ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఒక ప్రాంతానికో, వర్గానికో న్యాయం చేయాలనో, మరో ప్రాంతానికి నష్టం చేయాలనో చూడదని బొత్స చెప్పారు.
సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఎంపి ఉండవల్లి వివరించిన వాస్తవాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అధిష్ఠానం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇంత కాలం తనకు రెండు కళ్లని అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంత ప్రజలను మోసం చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇపుడు అధికారమే లక్ష్యంగా అఖిలపక్ష సమావేశంలో తమ నిర్ణయాన్ని చెప్పడాన్ని చూస్తే సిగ్గేస్తోందని వ్యాఖ్యానించారు.
మొసలి కన్నీరు కారుస్తూ పాదయాత్రల పేరుతో జనం ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. అధికారం ఉన్నపుడు ప్రజలు గుర్తు రాలేదని, ఇపుడు మాత్రం తెలంగాణ ప్రాంతం వెళ్లినపుడు తెలంగాణ మాటలు, ఆంధ్ర ప్రాంతానికి వచ్చినపుడు ఆంధ్ర మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.