ఉండవల్లి కాదు ఊసరవెల్లి, అప్పుడేమైంది: హరీష్
1972లో జై ఆంధ్రా, ఆ తర్వాత రెండు ప్రాంతాలు, ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ ఉండవల్లి ఊసరవెల్లిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎన్నికల సభలో సోనియా గులాబీ జెండా వేసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చినప్పుడు ఆమె మాటలను తెలుగులోకి అనువాదం చేసిన ఉండవల్లికి ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా? అని అడిగారు.
2004 ఎన్నికల్లో తెలంగాణ కోసం ఏర్పాటైన తమ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన అడిగారు. తెలంగాణలో దోపిడీ చేయడం ముమ్మాటికీ నిజమేనన్నారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అన్న ఉండవల్లి మాటలను ప్రస్తావిస్తూ 'నీలాంటి వారికి విషం చిమ్మడమెరుగు' అన్నారు. తెలంగాణలో విద్యుత్ వాడకం ఎక్కువని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టును తెలంగాణ ఉద్యోగ సంఘాలు సవాలు చేశారని గుర్తుచేశారు.
ఉండవల్లి సభలో ఒక్క మాటైనా జగన్ గురించి గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి గానీ మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నా, అప్పుడు ఎందరో అమాయకులు చనిపోయినా వారు చావలేదని ఎప్పుడైనా అన్నామా? అని ప్రశ్నించారు. ప్రాంతాల వారీగా విడిపోయి, ప్రజలుగా కలిసి ఉందామన్నారు. ఉండవల్లి చెప్పినవన్నీ అవాస్తవాలని ఏ చర్చా వేదికపైనైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్రావు అన్నారు.