తడాఖా చూపిస్తాం, రాజమండ్రి వస్తాం: ఉండవల్లికి కెకె

అమాయకులైన గిరిజనుల ప్రాణాలు తీసి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారా అని ఆయన అడిగారు. పోలవరం ప్రాజెక్టును తాము ఆమోదించబోమని ఆయన అన్నారు. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్రవాళ్లు 85 శాతం మంది ఉద్యోగాల్లో చేరారని గిర్గ్లానీ కమిషన్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏకపక్ష ఒప్పందాలు సమ్మతం కాదని, విడిపోవడానికి ఆంధ్రుల అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. ఇరువర్గాలు ఆమోదిస్తేనే ఒప్పందాలు అమలు అవుతాయని ఆయన అన్నారు.
తెలంగాణవాళ్లను కించపరిచే విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారని కెకె అన్నారు. ఉండవల్లి మాటలన్నీ అబద్ధాలేనని అన్నారు. తెలంగాణ నేతలంతా ఏకమై తెలంగాణ సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. జై ఆంధ్రప్రదేశ్ సభకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెళ్లకుండా ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. బొత్స వెళ్లడం వల్ల రాజమండ్రి సభకు అధికారిక ముద్ర పడిందని, సమైక్యాంధ్రకు బొత్స మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారని ఆయన అన్నారు. వారం రోజుల్లో హైదరాబాదులో సభ నిర్వహిస్తామని చెప్పారు. వాతావరణాన్ని ఉండవల్లి కలుషితం చేశారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేల సంఖ్య చూపి ఉండవల్లి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఉండవల్లి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వడానికి తాము రాజమండ్రికి రావడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. లేదా హైదరాబాదులో నిర్వహించే సభకు ఉండవల్లి వచ్చి చర్చకు సిద్ధపడాలని ఆయన అన్నారు. వచ్చే శనివారం లేదా ఆదివారం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో సభను పెడతామని ఆయన చెప్పారు. రజాకార్లతో పోరాడింది తెలంగాణవాళ్లేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు అభ్యంతరం లేదని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశం ఉందని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర నేతల విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెసు తెలంగాణ నేతలు సిద్ధం కావాలని ఆయన అన్నారు. పది మంది కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులు అసెంబ్లీకి రాకపోతే ప్రభుత్వం కూలిపోతుందని కెకె అన్నారు.












Click it and Unblock the Notifications