ఉండవల్లికిచ్చి, మాకెందుకివ్వరు: కోదండరామ్ ప్రశ్న
సమరదీక్షకు అనుమతి ఇవ్వకపోవడం విచారకరమని కోదండరామ్ అన్నారు. అనుంతి ఇచ్చినప్పుడు ఏ విధమైన సంఘటనలు చోటు చేసుకోవడం లేదని, అనుమతి ఇచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఘర్షణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాజమండ్రి సభతో తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బ తిన్నదని, అయినా రాజమండ్రి సభకు ఆంక్షలు పెట్టలేదని ఆయన అన్నారు. అనుమతి రాకపోతే నిరసన ఎలా ఉండాలనే విషయం ఆలోచన చేస్తామని ఆయన అన్నారు.
కోదండరామ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. కెసిఆర్తో వడ్లగింజలో బియ్యం గింజల గురించి మాట్లాడామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చాయ్ తాగి పది నిమిషాలు కూర్చున్నామని చెప్పారు. తమ హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఈటెల రాజేందర్ అన్నారు. కుంటిసాకులు చూపి తమ సమరదీక్షకు అనుమతి నిరాకరిస్తున్నారని కోదండరామ్ విమర్శించారు.
ఆంధ్రావాళ్లతో కలిసి ఉండలేమని మరోసారి స్పష్టమైందని ఆయన అన్నారు. రాజ్యాంగ విలువలపై వారికి విశ్వాసం లేదని ఆయన విమర్శించారు. అలాంటివారితో ఏ విధంగా కలిసి ఉంటామని ఆయన అడిగారు. ఆంధ్రావాళ్ల వ్యాఖ్యల నేపథ్యంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.