ఉండవల్లి వ్యాఖ్యలపై పొన్నం, టి - కాంగ్రెసు నేతల ఫైర్
తమ గొంతును సీమాంధ్ర నాయకులు ఢిల్లీలో నొక్కేస్తున్నారని ఆయన అన్నారు. ఇక సమావేశాలు ఉండవని చెప్పిన అధిష్టానం సీమాంధ్ర నాయకులకు ఎందుకు అపాయింట్ ఎందుకు ఇచ్చిందని ఆయన అడిగారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమైక్యవాది ఎప్పుడయ్యారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణవాళ్లను రజాకార్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన ఉండవల్లిని డిమాండ్ చేశారు. కాంగ్రెసు నాయకులను వైయస్సార్ కాంగ్రెసులో చేర్చే రహస్య ఎజెండాతో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. త్వరలో తాము నిజాం కళాశాల మైదానంలో సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
సీమాంధ్ర నాయకత్వం కోసం బొత్స సత్యనారాయణ పోటీ పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభలో పిసిసి అధ్యక్షుడైన బొత్స పాల్గొనడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. సోనియా ఆదేశించని సభకు బొత్స ఎలా వెళ్తారని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు నుంచి బొత్స పార్టీ అధ్యక్షుడు కారని ఆయన అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనపై బొత్స ఏం చెబుతారని ఆయన అడిగారు. సోనియా చెప్తే తెలంగాణకు అనుకూలంగా ఓటు వేస్తారో లేదో నిన్నటి సభలో పాల్గొన్న నేతలు చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఉండవల్లి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి డికె అరుణ అన్నారు. ఉండవల్లి వ్యాఖ్యలు సరైనవి కావని ఆమె అన్నారు. ఉండవల్లి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక ప్రాంత పక్షపాతిగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. ఉండవల్లి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.
పోలవరం గిరిజనులపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఉండవల్లి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బొత్స కూడా సమైక్యవాదే అని తేలిపోయిందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. బొత్స హాజరుతో జై ఆంధ్రప్రదేశ్ సభకు నిండుదనం వచ్చిందని ఆయన అన్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభలో పాల్గొనడాన్ని బొత్స విచక్షణకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. కలిసి ఉండడం సాధ్యం కాదని ఆ సభ ద్వారా తేలిపోయిందని ఆయన అన్నారు.