బొత్సకు కాంగ్రెసు టి -నేతల సెగ, ప్రసంగానికి అడ్డు
పిసిసి అధ్యక్షుడి హోదాలో రాజమండ్రి సభకు ఎలా వెళ్తారని పిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇంద్రసేనా రెడ్డి బొత్సను నిలదీశారు. ఆయన బొత్సతో వాగ్వివాదానికి దిగారు. బొత్స సత్యనారాయణ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నించారు. ఈ సమయంలో దానం నాగేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకుని వారించారు. బొత్స సత్యనారాయణపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానానికి చెప్పామని ఇంద్రసేనారెడ్డి అన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ బొత్సకు కండువా కప్పి జై తెలంగాణ నినాదాలు చేశారు. రాజమండ్రి సభలో బొత్స సత్యనారాయణ పాల్గొనడంపై తెలంగాణకు చెందిన మంత్రి జానా రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాజమండ్రి సభకు బొత్స ఎలా వెళ్తారని ఆయన అడిగారు. తమకూ చీమూ నెత్తురు ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా బొత్స తీరును తప్పు పట్టారు.
గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ ఏ రోజు కూడా ఒక ప్రాంతం పట్ల పక్షపాతంతో వ్యవహరించలేదని ఇంద్రసేనా రెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని బొత్స సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని పిసిసి కార్యదర్శి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేద్దామని బొత్స సత్యనారాయణ గణతంత్ర వేడుకల సందర్భంగా పిలుపునిచ్చారు. గాంధీభవన్లో ఆయన జాతీయ పతాకను ఆవిష్కరించారు.