తెలంగాణ వాయిదా: ఆజాద్ వర్సెస్ షిండే, చిద్దూ వంత
ఈ నెల వాయిదా పైన సుశీల్ కుమార్ షిండే, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మధ్య వాగ్వాదం జరిగిందట. కోర్ కమిటీలో వీరి మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. షిండే నెల వాయిదా ప్రకటనతో తెలంగాణపై అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చేసిందని, దీనిని ఎలా అమలు చేయాలన్నదాని పైనే చర్చలు జరుగుతున్నాయని రెండు వారాల క్రితం వరకు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
సీమాంధ్ర నేతలు ఢిల్లీలో మోహరించి అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ నేతలూ పోటీగా ఢిల్లీలో మకాం వేశారు. దీంతో దేశ రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధిష్ఠానాన్ని గందరగోళంలో పడవేసింది. ఈ పరిస్థితుల్లో గులాంనబీ ఆజాద్ బుధవారం మీడియా ముందుకు వచ్చి నెల అంటే నెల కాదని చెప్పారు. ఆజాద్ ప్రకటనపై షిండే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. కోర్ కమిటీ సమావేశంలో షిండేకు, ఆజాద్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది.
హోంమంత్రిగా తాను చేసిన ప్రకటనను అపహాస్యం చేస్తూ మాట్లాడడం సరికాదని, పార్టీ పరంగా జరుగుతున్న విషయాన్ని మీరు చెప్పండని, హోంమంత్రిగా తాను చేసిన ప్రకటనను మీరెలా నీరుగారుస్తారని షిండే ప్రశ్నించారట. ఆయనను చిదంబరం కూడా సమర్థించారట. అయితే షిండే నెల రోజుల గడువును పలువురు ఇతర నేతలు కూడా తప్పుపట్టినట్లుగానే ఇప్పటికే ప్రచారం జరిగింది. షిండే, ఆజాద్ల మధ్య వాగ్వాదాన్ని అహ్మద్ పటేల్ చల్లార్చారట.