తెలంగాణకు వ్యతిరేకం కాదు, తీర్మానంతోనే: ఉండవల్లి
తాను తెలంగాణను ఎప్పుడు వ్యతిరేకించలేదన్నారు. తాను ముప్పయ్యేళ్ల క్రితం జై ఆంధ్రా అని ఇప్పుడు సమైక్యాంధ్ర అనడం లేదన్నారు. తాను చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదన్నారు. కానీ తెలంగాణ నేతల వైఖరిని తప్పుపడుతున్నానని అన్నారు. రాజధాని ఉన్న ప్రాంతం వారు విభజన కోరుకోవడం దేశంలోనే ఇది ప్రప్రథమం అన్నారు. తెలంగాణ నేతలు నిజంగానే తెలంగాణ కోరుకున్నట్లుగా కనిపించడం లేదన్నారు.
ఆంధ్ర, సీమ ప్రాంతాల పట్ల తెలంగాణ నేతలు ఏహ్య భావాన్ని పెంచుకున్నారన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన పైన నాడు అంబేడ్కర్ తన పుస్తకంలో రాశారన్నారు. అంబేడ్కర్ చెప్పినవి నిజాలు అయినవన్నారు. హైదరాబాదును దేశ రెండో రాజధానిగా చేయాలని నాడు అంబేడ్కర్ చెప్పారన్నారు. హైదరాబాదులోని బొల్లారంలో రెండో రాజధాని పెట్టాలని అంబేడ్కర్ అప్పుడు పెట్టారన్నారు.
ఇప్పటి వరకు ఏర్పడిన రాష్ట్రాలు అన్ని అసెంబ్లీలో తీర్మానంతోనే ఏర్పడ్డాయన్నారు. కొన్ని రాష్ట్రాలను అందరూ సమర్థించారన్నారు. తెలంగాణ కోసం కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతం వారు రాష్ట్రాన్ని కోరడం ఇదే మొదటిసారి అన్నారు. అలాగే నదీ జలాలు ఉన్న వారు కోరడం కూడా ప్రపంచంలో ఇదే ప్రథమం అన్నారు. రాష్ట్రం కావాలంటే ఎక్కడైనా అసెంబ్లీలో తీర్మానం జరగాల్సేందే అన్నారు.
తెలంగాణను మేం అడ్డుకుంటున్నామని ఆరోపిస్తున్నారని కానీ, అది అవాస్తవమన్నారు. దేశంలో ప్రతి భారతీయుడు సమానమే అన్నారు. అన్నింటికన్నా రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిందని, దాని పరిస్థితి ఏమిటన్నారు. సీమాంధ్ర ప్రజలు దోపిడీ దొంగలు అంటూ నేతలు తెలంగాణ ప్రజల్లో ద్వేషం పెంచుతున్నారన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.
దొంగలు, దోపిడీదారులు అంటే తెలంగాణ ఏర్పడదన్నారు. కూర్చుని మాట్లాడుకుంటేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ ఏర్పడితే రాజధాని, నదీ జలాల సమస్య ఉందన్నారు. విభజనకు సామరస్య వాతావరణం కావాలన్నారు. అన్ పార్లమెంటరీ పదాలు వాడితే అది తప్పన్నారు. ఎవరు వాడినా అది సరైనది కాదని, అవసరమైతే తమకు సూచించాలన్నారు.