ఇక కాంగ్రెసే టార్గెట్, వంచించింది: కోదండరామ్ ఫైర్
ఇంకా ఏమి మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఎంత సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను వంచించి, మోసం చేసిన కాంగ్రెస్పైనే పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన సమర దీక్ష శిబిరంలో ఆదివారం రాత్రి కోదండరాం మాట్లాడారు. ఆజాద్, షిండే ప్రకటనల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. తమతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రాంతం వారు దీక్షలు చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి కోసం ప్రాధేయపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు అనుమతి కోసం ఈనెల 17న దరఖాస్తు చేశామని, ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. షిండే ఇచ్చిన గడువుపై ఆజాద్ చెప్పిన లెక్కలు చూస్తుంటే పాఠ్య పుస్తకాల్లోని లెక్కలను మార్చుకోవాలేమోనని వ్యంగ్యంగా అన్నారు.
షిండే, ఆజాద్ ప్రకటనలతో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని తెరాస నేత హరీశ్రావు చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ లక్ష్యంగా, ప్రభుత్వాన్ని కూలదోసేలా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్ రెడ్డి టికెట్ కొని ఇస్తేనే కొంతమంది తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారని చెబుతూ వారు వెళ్లింది తెలంగాణ కోసమా? ఆంధ్రా కోసమా చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు.
మంత్రులు రాజీనామా చేయకపోతే భవిష్యత్లో వారి కుమారులు, మనుమలు కూడా తల దించుకునే పరిస్థితి వస్తుందని, వారు తలదించుకునేలా చేస్తారా, తల ఎత్తుకునేలా చేస్తారా అన్న విషయాన్ని వారే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కాంగ్రెస్లో కొనసాగితే తెలంగాణకి ద్రోహం చేసినట్లేనన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ను, టీడీపీని నమ్మి మోసపోయామన్నారు.
కాగా, సభ ప్రారంభానికి ముందు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. సమర దీక్షకు అనుమతి కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చిందని, దీక్షలో పాల్గొనేవారు శాంతియుతంగా ఉండాలని, గడువులోగా ముగించాలని సూచించారు.