రేపే రాజీనామాస్త్రం: అధిష్టానంపై ఒత్తిడికి కాంగ్ ఎంపీలు
దీంతో వారు కూడా అదే అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే సాయంత్రం మంత్రి జానా రెడ్డి ఇంట్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన గడువు ఈ రోజు(సోమవారం)తో ముగియనుంది. ఈ రోజు కేంద్రం నుండి తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాకుంటే రేపు అందరి కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రులు తమ మంత్రి పదవులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. రాజీనామాలు చేసి ఒత్తిడి తెస్తేనే కేంద్రం తెలంగాణ ఇస్తుందనే నిర్ణయానికి వారు వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ సున్నితమైన అంశం
తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మరింత లోతైన అధ్యయనం కావాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ సోమవారం గుంటూరు జిల్లాలో అన్నారు.