ఉరిశిక్ష వేయాల్సిందే కాంగ్రెసు పార్టీకే: రేవంత్ రెడ్డి
అవిశ్వాస తీర్మానం పెట్టడమనేది రాజకీయ వ్యూహంలో భాగమని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో సందర్భాన్ని బట్టి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని, పరిష్కారానికి అవసరమైతే తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఊహాగానాల మీద తాము రాజకీయాలు చేయబోమని ఆయన అన్నారు. తమ పార్టీ మాత్రమే సుస్థిర పాలన అందించగలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొని ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుమ్మక్కయ్యాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ సమరదీక్ష వేదిక వద్ద కాంగ్రెసు నాయకులను తెలంగాణవాదులు అడ్డుకుంటే తెరాస శాసనసభ్యుడు వారిని వేదిక మీదికి తీసుకుని వెళ్లారని, దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు కమ్మక్కయిన తీరు వెల్లడవుతోందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మోసం చేస్తోందని, అటువంటప్పుడు కాంగ్రెసు నేతలతో వేదికను ఎలా పంచుకుంటారని ఆయన అన్నారు.
తెలంగాణ అంశాన్ని దాటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు ఉన్న తెగువ తెలంగాణ కాంగ్రెసు నాయకులకు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం బలపడుతుందనే భయంతోనే తెలుగుదేశం పార్టీని బూచిగా ఇంత కాలం చూపించారని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇంకా ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజలను మోసం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో కాంగ్రెసు నాయకులను భాగస్వాములను చేయడంపై తెలంగాణ జెఎసి కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆయన సూచించారు. తెలంగాణపై కార్యాచరణకు తాము త్వరలో సమావేశమవుతామని ఆయన చెప్పారు.