రాహుల్ గాంధీకి తెలంగాణ టెస్టు, పరిష్కరిస్తారా?
ఉపాధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తెలంగాణపై జనవరి 26వ తేదీన జరిగిన తొలి కోర్ కమిటీ సమావేశంలో రాహుల్ పాల్గొనలేదు. అయితే, ఆయన తదుపరి కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటారని చెబుతున్నారు. కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై చర్చించారు.
భవిష్యత్తులో రాహుల్ కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొని తెలంగాణ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతారని అంటున్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ 2011 సెప్టెంబర్ 16వ తేదీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని వచ్చిన సోనియా ఆ సమావేశానికి హాజరు కాలేకపోయారు.
అన్ని వర్గాల ప్రజలకు పార్టీని దగ్గర చేయాలనే ఉద్దేశాన్ని ఆయన జైపూర్ చింతన్ శిబిర్లో వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలకే పార్టీ పరిమితం కాదని, దిగువ స్థాయి ప్రజలకు కూడా చేరువ కావాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణపై తీసుకునే నిర్ణయంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు.