రేపు ఏడుగురు టి - ఎంపీల రాజీనామా, పార్టీకి కూడా..
తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులను కూడా తమతో కలుపుకుని వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. లోకసభ సభ్యత్వాలకు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామాలు చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సుదీర్ఘమైన లేఖ రాయాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. వారంలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం ప్రకటించాలని, లేదంటే తమ రాజీనామా లేఖలను స్పీకర్కు పంపించాలని సోనియాను కోరుతూ వారు లేఖ రాయనున్నారు.
తమకు పదవులు చిత్తు కాగితాలతో సమానమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని ఆయన కోరారు. తెలంగాణ ఇస్తామన్నా ప్రజలు కాంగ్రెసును నమ్మే పరిస్థితిలో లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన ఉదంతాలను గుర్తు చేస్తూ సోనియాకు లేఖ రాయాలని కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు నిర్ణయించుకున్నారు.
తెలంగాణ ఇచ్చే విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే కాంగ్రెసు పార్టీని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని మధు యాష్కీ అన్నారు. మాట తప్పడం, నాన్చుడు ధోరణి కారణంగా ప్రజలు కాంగ్రెసు పార్టీని విశ్వసించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న నాయకులపై తెలంగాణ ఉద్యమకారులు దాడులు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడాలని తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అనడాన్ని బట్టి వారిద్దరు తెలంగాణకు అడ్డుపడుతున్నారని అర్థమవుతోందని, వారిద్దరనీ తెలంగాణ ఉద్యమకారులు నిలదీయాలని ఆయన అన్నారు.
తెలంగాణపై ఆదివారం ఆజాద్ చేసిన ప్రకటనను తెలంగాణ ఎంపీలు ఖండించారు. తెలంగాణపై తమను పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి పార్టీ అధిష్టానం తెలంగాణపై ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతోందని వారు అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కీ, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగ్నాథం, జి. వివేక్, పొన్నం ప్రభాకర్ రేపు మంగళవారం రాజీనామా చేయనున్నారు.