నీ స్థాయి ఏమిటో తెలుసుకో, సీల్డ్ కవర్..: కిరణ్పై కెటిఆర్
రాష్ట్రం లో ఒక్క ఎమ్మెల్యే అయినా కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడా? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కనీసం ఆయన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మద్దతు ఆయనకుందా? అని కెటిఆర్ అడిగారు. ''నీ స్థాయి ఆలోచించుకో! సోనియా దయదలిస్తే సీల్డ్ కవర్ సీఎం అయ్యావు. జాగ్రత్తగా మాట్లాడాలి'' అని ఆయన హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది? పార్టీ అభ్యర్థులను సోనియా, రాహుల్ గెలిపించుకోగలిగారా? వారా నాయకులు? వారిదా చరిత్ర?' అని ఆయన అన్నారు. "ఉమ్మడి రాష్ట్రం కావాలనుకోవడం సామ్రాజ్య విస్తరణ కాంక్ష అని చెప్పిన నెహ్రూ ఆ తర్వాత సీమాంధ్ర నేతలకు దాసోహమై మాట మార్చి తెలంగాణకు, ఆంధ్రాకు బలవంతపు పెళ్లి చేయలేదా?'' అని ప్రశ్నించారు.
''1969లో తెలంగాణ ఉద్యమంపై ఇందిరమ్మ ఉక్కుపాదం మోపలేదా? వందలాది ఉద్యమకారులను పొట్టన పెట్టుకోలేదా? అప్పుడు తెలంగాణ ప్రజా సమితి తరఫున ఎన్నికైన 11 మంది ఎంపీలకు మాయమాటలు చెప్పి వారిని కాంగ్రెస్లో కలుపుకోలేదా? 2004 ఎన్నికల్లో సోనియా గులాబీ కండువా కప్పుకొని ప్రచారంలో పాల్గొనలేదా? ప్రధానిని చెప్రాసీ కంటే హీనం అంటే తప్పేంటి!?'' అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రికి పదవీ భయం పట్టుకుందని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు తెలుగు ప్రజలను అగౌరవపర్చాయన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "మీకు తెలుగు వచ్చా. ఐదు నిమిషాలు తప్పు లు లేకుండా, భాషా దోషాలు లేకుండా తెలుగులో మాట్లాడగలవా?'' అంటూ ప్రశ్నించారు.
"తెరాస ప్రాంతీయ పార్టీ అయితే 2004 ఎన్నికలకు ముందు ఆజాద్ను కేసీఆర్ ఇంటికి ఎందుకు పంపారు? తెరాసతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? దేహీ అంటూ మా నేత ఇంటికి ఎందుకు వచ్చారు?'' అని కెటిఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 'నీవే చివరి ముఖ్యమంత్రివి' అని జోస్యం చెప్పారు.
కేసులు పెట్టినా, తెలంగాణ ఉద్యమం ఆగదని, కేసులు, జైళ్లకు భయపడమని ఆయన అన్నారు. ఇటీవల వాయలార్ రవి ఫోన్ చేస్తేనే కెసిఆర్, తాము ఢిల్లీకి వెళ్లామని, తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామని చెప్పామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తర్వాతే తమ పార్టీతో రాజకీయ బేరం మాట్లాడుకోవాలని కాంగ్రెస్కు సూచించారు.