రాబందులా పీక్కు తిన్నారు: కెసిఆర్పై లగడపాటి
వ్యక్తిపరంగా గానీ, ప్రభుత్వ పరంగా కానీ కెసిఆర్ ఒక్క వ్యక్తికి కూడా మేలు చేయలేదని, పిల్లికి కూడా బిచ్చం వేయలేదని ఆయన అన్నారు. ప్రజల జీవితాలతో కెసిఆర్ ఆడుకుంటున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు తమ నాయకులు సహాయం అందించారని ఆయన గుర్తు చేశారు. తెలుగువారంతా కలిసి ఉండాలని గాంధీయే చెప్పారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదు దేశానికి రెండో రాజధానిగా ఉండాలని, వరంగల్ను తెలుగు ప్రాంతానికి రాజధానిని చేయాలని అంబేడ్కర్ సూచించారని ఆయన అన్నారు. రాజధాని కాబట్టి హైదరాబాదును, కంటోన్మెంట్ను ప్రత్యేక డివిజన్గా పరిగణించాలని ఆరు సూత్రాల పథకం చెబుతోందని ఆయన అన్నారు.
హైదరాబాద్ను కలుషితం చేస్తున్నారని, హైదరాబాదును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భావోద్వేగంతో రాజకీయం చేయకూడదని వ్యక్తిని తాను అని ఆయన చెప్పుకున్నారు. కెసిఆర్ తిట్ల పురాణానికి సిగ్గు వేస్తోందని లగడపాటి వ్యాఖ్యానించారు. కెసిఆర్ స్వార్థంతో చేస్తున్న విమర్శలను ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. భయభ్రాంతులను చేసి ప్రజాప్రతినిధుల నోళ్లు మూయించాలని చూస్తున్నారని, ప్రజలు నోళ్లు తెరిచే రోజులు వస్తాయని, వారి నోళ్లను మూయించలేరని, 90 శాతం మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వాస్తవాలు చెప్పారు కాబట్టి మింగుడు పడడం లేదని ఆయన అన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెరాస శాసనసభ్యుడు కెటి రామారావుకు తెలంగాణ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఆయన అడిగారు. ఉద్యమం పేరుతో దండుకునే కెటిఆర్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే హక్కు ఉందా అని ఆయన అడిగారు. ఇంత కాలం తాము సహనంతో ఉన్నామని, ఇక ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు వేర్పాటువాదులకు, విచ్చిన్నకారులకు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఎన్ని రాష్ట్రాలు ఉండాలి, రాష్ట్రాల విభజన ఎలా ఉండాలి అనే విషయాలు శాస్త్రీయ పద్ధతిలో జరగాలని ఆయన అన్నారు.