పాదయాత్రకు షర్మిల సిద్ధం: ఫిబ్రవరి 6నుండి ఆగినచోటే
షర్మిల తన పాదయాత్రను ఎక్కడ అయితే ఆపారో అక్కడి నుండే తిరిగి ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ నుండి ఆమె యాత్ర ప్రారంభం అవుతుంది. కాగా తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని షర్మిల నాలుగు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. అపోలో వైద్యులు చంద్రశేఖర్, మదన్మోహన్ రెడ్డి కూడా శనివారం నాడు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. షర్మిల పాదయాత్ర చేయవచ్చునని, అయితే పాదయాత్ర సందర్భంగా కూడా ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని వారన్నారు.
ప్రస్తుతం షర్మిల నడవగలిగే స్థితిలో ఉన్నారని వారు చెప్పారు. షర్మిలకు అపోలో ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 18వ తేదీన ఆమె మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆమె ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగానే ఆమె మీడియా ప్రతినిధులతో తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. షర్మిల ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె త్వరలోనే పాదయాత్ర చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.
షర్మిల పాదయాత్రపై పార్టీలో చర్చిస్తామని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కడప జిల్లా పులివెందుల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నెలన్నర క్రితం ఆమె పాదయాత్రను ఆపేసి, మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కిలోమీటర్లలో 82 2కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైయస్ జగన్ జైలుకు వెళ్లడంతో నిరుడు అక్టోబర్ నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.