అందుకే తిట్టడం: కెసిఆర్కు ఎర్రబెల్లి అండ, జానాపై ఫైర్
తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళనకు దిగాలని సూచించారు. లేదంటే వారిని తరిమేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్లోనే సమర్పించాలని సూచించారు.
తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ఆ హామీని మరిచిపోయిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు, మంత్రులు నాటకాలు కట్టిపెట్టాలన్నారు. సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నారు. సహకార ఎన్నికల తర్వాత తెలంగాణపై టిడిపి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
కాగా రెండు రోజుల క్రితం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమర దీక్షలో కెసిఆర్ తెలంగాణకు అడ్డుపడుతున్న నేతలు అంటూ పలువురిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెసు పార్టీ నేతలు కెసిఆర్ పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రాంత నేతలు కూడా కెసిఆర్ పైన మండిపడ్డారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మధుయాష్కీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, వి హనుమంత రావు, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తదితరులు విమర్శలు గుప్పించారు.