రిజైన్లపై టి-ఎంపీలు వెనక్కి: టైమ్ కావాలన్న ఆజాద్
తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, తెలంగాణ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ ఎంపీలు అన్నారు. తాము లేని సమైక్యాంధ్ర ఉండదని వారన్నారు. అవినీతిపరులైన కొంత మంది సీమాంధ్ర నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను అధికారంలోకి తేవాలన్నట్లు వ్యవహరిస్తున్నారని వారన్నారు. చర్చలు జరుగుతున్నప్పుడు ఓపిక, సంయమనం పాటించాలని ఆయన అన్నారు. తెలంగాణను ఇచ్చే నాయకత్వాన్ని వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు.
తమ ఇళ్లపై దాడి చేస్తే సహించేది లేదని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఎబివిపిని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు నుంచి నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రకటన వెలువడి, రాజ్యాంగ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు అన్నారు. కాంగ్రెసు ద్వారానే తెలంగాణ వస్తుందని వారన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావు హైదరాబాదులో అన్నారు. చాకో ప్రకటన ఆ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. రెండు మూడు వారాల్లో లేదా బడ్జెట్ సమావేశాల తర్వాత గానీ తెలంగాణపై కేంద్రం నుంచి ప్రకటన రావచ్చునని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయం కావాలని కాంగ్రెసు అంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణపై రెండేళ్లుగా ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తూనే ఉన్నామని ఆయన బుధవారం ఒడిషాలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఒక ప్రాంతంవారు విభజన కోరితే రెండు ప్రాంతాలవాళ్లు వ్యతిరేకిస్తున్నారని, మూడు ప్రాంతాలవారిలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.