తెలంగాణ మృత్యుఘోష: ఒక్క రోజే ముగ్గురు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లాభీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన తడగొన అజయ్ (21) అనే డిగ్రీ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి పది గంటల సమయంలో తల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మితో కలిసి టీవీ చూస్తున్నాడు. ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లి, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఇంటి నుంచి వీధిలోకి వచ్చి పరుగులు తీశాడు. వారి వెంట తల్లిదండ్రులు పరుగులు తీశారు.
మంటలను తాళలేక అజయ్ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకాడు. అతని వెంటే తల్లిదండ్రులు నీటిలోకి కొడుకుని రక్షించుకునేందుకు దూకారు.ఇదంతా చూసిన స్థానికులు స్పందించి శ్రీనివాస్, లక్ష్మిలను మాత్రం కాపాడగలిగారు. బావిలో నుంచి బయటకు తీసేసరికే అజయ్ మృతిచెందాడు. 'ఈనెల 28న తెలంగాణపై షిండే ప్రకటన చేయనందున ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని అజయ్ లేఖ రాశాడు.
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ చంద్ర (23) బుధవారంనాడు హైదరాబాదులోని సరూర్నగర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దినేశ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. తండ్రి రమేశ్ గుమాస్తాగా పని చేస్తుండగా, తల్లి శశికళ చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు.
తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హైదరాబాద్లోనే మరో ప్రాంతంలో ఉంటున్న తన మామయ్య కొడుకు రాఘవ సెల్కు ఎస్ఎంఎస్ పంపాడు. ఆ తర్వాత తన ఫోన్ను ఆఫ్ చేశాడు. రాఘవ తన తండ్రికి, దినేశ్ అక్కకు సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన తిరిగి వచ్చేసరికే తన గదిలోని ఫ్యాన్కు దినేశ్ నిర్జీవంగా వేలాడుతున్నాడు. 'నా చావుతోనైనా తెలంగాణ రావాలి లేదా పోవాలి. ఏదో ఒక నిర్ణయం కావాలి. బంద్లు లేకుండా తెలంగాణ తేవాలని కేసీఆర్ను కోరుతున్నా. నేను చేసేది తప్పు. ఈ తప్పును ఎవరూ చేయొద్దు' అని లేఖ రాసి మరీ దినేశ్ చనిపోయాడు.
ఉ'నెలంటే నెలకాదు' అని ఆజాద్ చేసిన ప్రకటనతో మనస్తాపానికి గురై ఆదివారం ఒంటికి నిప్పంటించుకున్న మహేశ్(27) బుధవారం చనిపోయారు. కరీంనగర్ జిల్లా నాగంపేటకు చెందిన మహేశ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తగా పని చేస్తున్నారు. జనవరి 28న తెలంగాణపై ప్రకటన వస్తుందని నమ్మకంగా ఉన్న ఆయన ఆజాద్ ప్రకటన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు.
అప్పటి నుంచి సిరిసిల్లలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. తెలంగాణ కోసమే తాను బలిదానానికి పాల్పడినట్లు మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో మహేశ్ తెలిపారు. తన భర్త మృతికి షిండే, ఆజాద్లే కారణమని కావ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా రాయికల్కు చెందిన భారతపు చంద్రశేఖర్ (28) మంచిర్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.