జగన్ జైలుకెందుకెళ్లాడు?: బాబు, యాత్రలో వంశీ, ఉమ
బాబు సాయంత్రం ఐదు గంటలకు కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం దోనబండ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం కేతనకొండ, మూలపాడు మీదుగా 7.3 కిలోమీటర్లు నడిచారు. మొదట పరిటాల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. ఎంవిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానూ, పాదయాత్రలోనూ, సభల్లోనూ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై నిప్పులుచెరిగారు.
ఆ వ్యక్తి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది ప్రజలు సీరియస్గా తీసుకుని ఆలోచించాలని పరోక్షంగా జగన్ అంశాన్ని ప్రస్తావించారు. ఎవరి మీదో కోపంతో తాను ఈ విషయాలు చెప్పడం లేదని, అవినీతి వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. వైయస్ ఐదు సంవత్సరాల నాలుగునెలల పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన వారే ఇప్పడు మాయ మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
దుర్మార్గులపై తాను సాగిస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని పిలుపు నిచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే నెల రోజుల్లో పాలన గాడిలో పెడతామన్నారు. మహిళల భద్రత పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. మన దేశం చాలా గొప్పదని కామన్ మెన్కు కామన్ సెన్స్ ఎక్కువ అన్నారు. పాదయాత్రలో బాబుతో పాటు కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, వల్లభనేని వంశీ ఇద్దరూ పాల్గొన్నారు.