టిడిపి చెప్పినట్లు: జగన్పై బిజెపికి ఓ క్లారిటీ వచ్చిందా?
జగన్కు అధికార కాంగ్రెసు పార్టీతో ఒప్పందం కుదిరిపోయినందు వల్లే వారు మాటల దాడి పెంచి ఉంటారని అంటున్నారు. జగన్ అవినీతి పైన బిజెపి చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇంతలా విరుచుకుపడ్డ సందర్భాలు మాత్రం లేవనే అంటున్నారు. జగన్ కాంగ్రెసు పార్టీతో తెగతెంపులు చేసుకొని కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఆయన బిజెపితో కలుస్తారేమోననే ప్రచారం జరిగింది. దానిని జగన్ స్వయంగా కొట్టిపారేశారు.
అవసరమైతే తాను కేంద్రంలో లౌకికవాద పార్టీతో కలుస్తానే తప్ప బిజెపితే కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. ఆ పార్టీ నేతలు కూడా పలుమార్లు ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. అయితే బిజెపి మాత్రం జగన్ కోసం కొన్ని రోజులు వేచి చూసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. జగన్ కలవనని ఖరాఖండిగా చెప్పినప్పటికీ బిజెపిలో ఆశలు ఉండటం వల్లనే వారు ఇన్నాళ్లూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మిగిలిన పార్టీల స్థాయిలో విమర్శలు గుప్పించలేదనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే జగన్ విషయంలో ఇప్పటికీ బిజెపిలో ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలు ఇప్పటికే జగన్ ఎప్పటికైనా కాంగ్రెసులో కలుస్తారనే ఆరోపణలు తీవ్రంగా గుప్పిస్తున్నారు. టిడిపి కిరణ్ ప్రభుత్వంతో కుమ్మక్కయిందని జగన్ పార్టీ ఆరోపణలు చేసింది. అలాగే తెరాస పైన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు ఆరోపణలు చేసింది. వారి ఆరోపణలు ఎలా ఉన్నా బిజెపి ఆరోపణలు మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి.
తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, అధికార కాంగ్రెసు పార్టీ స్థాయిలో ఇన్నాళ్లూ జగన్ పార్టీ పైన బిజెపి మాట్లాడలేదు. కానీ ఈ రోజు వారికంటే ఘాటైన వ్యాఖ్యలన్ని బిజెపి చేసింది. జగన్ పైన క్లారిటీ వచ్చినందు వల్లే ఇలా విమర్శల పదును పెంచి ఉంటారేమో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెసుతో జగన్ ముందు ముందు చేతులు కలువవచ్చుననే స్పష్టమైన సంకేతాలు అందటం వల్లనే మాటల వేడి పెంచి ఉంటారని అంటున్నారు.
ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఈ రోజు మాట్లాడుతూ.. మతం ముసుగులో బ్రదర్ అనిల్ కుమార్ కోట్లు సంపాదించుకుంటున్నారని, షర్మిల, అనిల్లు పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై జగన్ పార్టీ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడేందుకే జగన్ పార్టీ అవిశ్వాసం పెట్టడం లేదన్నారు.