తెలంగాణ హీట్: రాహుల్‌తో చిరు, భేటీలతో కిరణ్ బిజీ

Chiranjeevi-Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కినట్లే కనిపిస్తున్నాయి. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరుస భేటీలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన సోమవారం రాత్రి కూడా ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యవాది అయిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాదులో బొత్సతో సమావేశమయ్యారు. కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే, ఏకాభిప్రాయం సాధ్యం కాదు కాబట్టి తెలంగాణ రావడం కుదరదని లగడపాటి బొత్సతో భేటీ తర్వాత అన్నారు.

ఇదిలావుంటే, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగాల కల్పనపై చర్చించేందుకు చిరంజీవి రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు చెబుతున్నారు. అయితే, చిరంజీవి రాష్ట్ర రాజకీయాలపై, తెలంగాణ అంశంపై రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. సమైక్యవాది అయిన చిరంజీవి తన అభిప్రాయాన్ని రాహుల్ గాంధీతో చెప్పినట్లు సమాచారం. చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు సమైక్యవాద ఉద్యమంలో అగ్రభాగాన ఉంటున్నారు. చిరంజీవి సూచన మేరకే తెలంగాణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాస రావు సమైక్యవాద ఉద్యమంలో పాల్గొంటున్నట్లు చెబుతున్నారు.

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దిగిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. సహకార సంఘాల ఎన్నికల ఫలితాలపై, మాజీ మంత్రి పి. శంకరరావు ఉదంతంపై, మజ్లీస్ నేతల వ్యవహారంపై ఆయన ఆజాద్‌కు వివరించినట్లు సమాచారం. అయితే, ఆజాద్‌తో ముఖ్యంగా తెలంగాణ అంశంపైనే చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆజాద్‌తో ముఖ్యమంత్రి గంటపాటు సమావేశమయ్యారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు అరగంట పాటు సాగింది. రాష్ట్ర రాజకీయాలపై ఆయన సోనియాకు ఓ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ అంశంపై సోనియా మాట్లాడినట్లు చెబుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా సోనియాను కలిశారు. 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి ముందు రోశయ్యతో మాట్లాడి అందుకు అనుగుణంగా శాసననసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచించారు.

హైదరాబాదు చేరుకున్న రోశయ్య అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించడానికి వీలు లేకుండా సీమాంధ్ర శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు పూనుకున్నారు. అయితే, డిసెంబర్ 7వ జరిగిన అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానం ప్రతితో రోశయ్య ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి ఎదురు తిరిగింది. ఈ విషయాలపై రోశయ్య నుంచి సోనియా గాంధీ మాట్లాడినట్లు తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి కలిసిన కొద్దిసేపటికే హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోనియా నివాసానికి వెళ్లారు. అయితే, కొద్దిసేపటికే ఆయన బయటకు వచ్చారు. కాగా, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తెలంగాణపై చర్చ జరిగిందనే పుకార్లు పుట్టినప్పటికీ, ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెప్పాయి. ఎఐసిసి నేతలు మోతీలాల్ వోరా, దిగ్విజయ్ సింగ్‌లతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. భేటీలమీద భేటీలు జరుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి నోరు మాత్రం విప్పలేదు.

కాగా, సోమవారం రాత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదు తిరిగి వెళ్లాలని భావించారు. అయితే, ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. కాంగ్రెసు కోర్ కమిటీకి చెందిన సుశీల్ కుమార్ షిండే, వాయలార్ రవి, చిదంబరాలతో ఆయన సమావేశమవుతారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న సమయంలోనే సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలోనే ఉండడం గమనార్హహం. బొత్స ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారా, బొత్స భేటీలతో ప్రమేయం లేకుండా హైదరాబాదు వెళ్తారా అనేది తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+