మేం వింటున్నామా: నాగంకు కోదండరామ్ కౌంటర్
నాగం జనార్దన్ రెడ్డి కూడా తమలో ఓ సభ్యుడేనని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస గౌడ్ అన్నారు. కమిటీలో లేనంత మాత్రాన జెఎసితో నాగం జనార్దన్ రెడ్డికి సంబంధం లేదనడం సరి కాదని ఆయన మీడియాతో అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిని త్వరలోనే జెఎసిలోకి తీసుకునే అంశంపై అన్ని పార్టీలతో కలిసి చర్చిస్తామని ఆయన చెప్పారు.
గవర్నర్ వైఖరిలో మార్పు కనిపించింది
తెలంగాణ విషయంలో గవర్నర్ నరసింహన్ వైఖరిలో కాస్తా మార్పు కనిపించిందని కోదండరామ్ అన్నారు. ఇరవై మంది జెఎసి నేతలు గురువారంనాడు కోదండరామ్ నేతృత్వంలో గురువారం రాజభవన్లో గవర్నర్ను కలిశారు. ఆ తర్వాత కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం విధించిన డిసెంబర్ 28 డెడ్లైన్ ముగిసిన తర్వాత తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల గురించి గవర్నర్కు వివరించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పినట్లు ఆయన తెలిపారు. దానిపై స్పందించిన గవర్నర్ తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని తన మాటగా చెప్పాలని తమకు సూచించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై కేంద్రం త్వరితగతి నిర్ణయం తీసుకోవడానికి చొరవ చూపాలని తాము గవర్నర్ను కోరినట్లు ఆయన తెలిపారు.
కౌన్సెలింగ్ ద్వారా తెలంగాణలో ఆత్మహత్యలు ఆగవని కోదండరామ్ గవర్నర్తో చెప్పారు. రాజకీయ నిర్ణయం తీసుకుని తెలంగాణ ఏర్పాటు చేస్తేనే ఆత్మహత్యలు ఆగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానానికి వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వాలని, ఢిల్లీ వెళ్లినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రానికి తెలపాలని ఆయన నరసింహన్నను కోరారు.