తెలంగాణకు కిరణ్ అడ్డుపడుతున్నారు: పాల్వాయి
కాంగ్రెసు పార్టీలోని కిందిస్థాయి నాయకులను ప్రభుత్వం గానీ, పిసిసి గానీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక నాయకత్వాల వల్లనే సహకార ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచిందని ఆయన అన్నారు. ఈ వాస్తవాలను తాను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని ఆయన చెప్పారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు దోచుకోవడానికి పోలవరం ప్రాజెక్టు టెండర్ల అంచనాలను పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రారంభంలో 6 వేల కోట్ల రూపాయల ఉన్న అంచనా ఇప్పుడు రూ. 16 వేల కోట్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
సహకార ఎన్నికలను తెలంగాణ అంశంతో ముడిపెట్టవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన గురువారంనాడు అన్నారు. ఆ అంశంఫై కాంగ్రెసు అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు.
2014లోపు తెలంగాణ ఇస్తామని గానీ ఇవ్వబోమని గానీ తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. తెలంగాణకు తమ పార్టీ ఎప్పుడూ గడువులు పెట్టలేదని ఆయన గురువారం మీడియాతో అన్నారు. తెలంగాణపై ఇచ్చిన మాటకు సోనియా గాంధీ కట్టుబడి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామాల విషయంలో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గీత దాటలేదని ఆయన అన్నారు.