నిర్మల్లో అడుగుపెట్టొద్దు: అక్బర్కు బెయిల్, విడుదల!
అక్బర్కు జిల్లా సెషన్స్ కోర్టు మూడు షరతులతో కూడిన బెయిలును ఇచ్చింది. పాసుపోర్టును అప్పగించాలని, నిర్మల్ పట్టణంలో ప్రవేశించకూడదని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం షరతులు విధించింది. రూ.70వేల చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్ ఇచ్చింది. పైన విధించిన షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని న్యాయస్థానం తెలిపింది.
అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ రావడంతో అదిలాబాద్ జిల్లా సబ్ జైలు అధికారులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తమ పార్టీ నేతకు బెయిల్ రావడంతో మజ్లిస్ పార్టీ నేత కార్యకర్తలు ఆనందంతో ఉన్నారు. అక్బరుద్దీన్ విడుదల సందర్భంగా రేపు పలువురు మజ్లిస్ కార్యకర్తలు అదిలాబాదుకు వచ్చే అవకాశముంది.
కాగా అక్బరుద్దీన్ ఓవైసీకి నిజామాబాద్ కోర్టు అంతకుముందు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ కోర్టులో తనపై విచారణ పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని విచారించిన కోర్టు ఈ రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేలు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో బెయిల్ వచ్చింది.