ఎంత దూరం నడిచామన్నది కాదు: ఇది షర్మిల డైలాగ్!
ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదని, ఎంత మందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యమని ఆమె అన్నారు. పాదయాత్ర చేసే వ్యక్తికి విశ్వసనీయత, చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలని హితవు పలికారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఓ యజ్ఞంలా భావించి చేశారన్నారు. ఎన్నికల ముందు తనను జ్ఞాపకం ఉంచుకోవాలంటూ చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు నిజంగానే ప్రజల పైన, ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వెంటనే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. పాదయాత్ర అంటే పరుగు పందెం కాదని, రికార్డుల కోసం చేసేది కాదన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యలపై స్పందించేందుకు చేయాలన్నారు. పాదయాత్రను మహాయజ్ఞంగా భావించి చేయాలన్నారు.
పాదయాత్ర ద్వారా ఎంత మందికి నమ్మకం కలిగించామనేది ముఖ్యమన్నారు. బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయిందని ఆ పార్టీ వారు కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. ఆయన జపం చేసే మీడియా అంతా చంద్రబాబు రికార్డు సృష్టించారని చాలా ప్రచారం కల్పించిందన్నారు. పాదయాత్ర అంటే నడక పందెం కాదని తెలుగు దేశం వారికి, ఆ వర్గం మీడియాకు అర్థం కావడం లేదన్నారు.