ప్రభుత్వాన్నినడపగలరా?: మమతబెనర్జీకి గవర్నర్ షాక్
కోల్కతా పోలీసు బాసునుఉన్నట్టుండి తొలగించడంపై గవర్నర్ నారాయణన్ అసహనం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నారా.. లేదా అంటూ తృణమూల్ కాంగ్రెస్ను ప్రశ్నించారు. సిపిని ఎందుకు తొలగించారో తనకు తెలియదని, కానీ కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలు చూస్తుంటే దీనిపై జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.
మనకు చాలా భారీ మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వముందని కానీ, అసలు ప్రభుత్వాన్ని నడపగల సమర్థత ఉందా లేదా అన్నదే ప్రశ్న అని, దానికి వారు సమాధానం చెప్పాలన్నారు. ఘర్షణ సంఘటనతో సంబంధమున్నట్లు ఎఫ్ఐఆర్లో పేరున్న ఓ తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ను మంత్రి ఫర్హాద్ హకీమ్ వెనకేసుకు రావడంపై కూడా గవర్నర్ ఎంకే నారాయణన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు పార్ట కార్యకర్తలకు మధ్య పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం జరిగిన ఘర్షణలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందగా,, మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ ఏరియా ప్రాంతంలోని ఓ కళాశాలలో ఎన్నికల నామినేషన్ పత్రాలు రెండు పార్టీల నేతలు నింపుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది.