హైడ్రామా: ఎట్టకేలకు అక్బరుద్దీన్ విడుదల, అభివాదం
అక్బరుద్దీన్ ఓవైసీ పాసుపోర్టును ఆయన తరఫు న్యాయవాదులు పోలీసులకు సమర్పించారు. దీంతో అదిలాబాదు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అక్బర్ బెయిల్ విడుదల పత్రం పైన సంతకాలు చేశారు. అక్బరును విడుదల చేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ ఉత్తర్వులను న్యాయవాదులు తీసుకు వచ్చి జైలు అధికారులకు ఇచ్చారు. ఉదయం నుండే అక్బరుద్దీన్ విడుదల సన్నాహయత్నాల్లో జైలు అధికారులు ఉన్నారు. పత్రాలు అందడంతో అధికారులు అక్బర్ను విడుదల చేశారు.
అక్బరు విడుదలతో పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. హైదరాబాదులో కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు. అక్బర్ జైలు నుండి నేరుగా బంజారాహిల్స్లోని తన ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇంటి వద్ద కూడా హడావుడి నెలకొంది. ఘన స్వాగతం పలికేందుకు నగరంలో కార్యకర్తలు సిద్ధమయ్యారు. మరికొందరు భారీ ర్యాలీతో వచ్చేందుకు అదిలాబాదు వచ్చారు. జైలు నుండి భారీ ర్యాలీగా రానున్నారు.
మరోవైపు సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ ఈ రోజు విడుదలయ్యారు. 38 రోజుల పాటు అతను జైలులో ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అక్బర్ హైదరాబాద్ వస్తున్నారు.
కాగా అక్బర్ విడుదలకు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్బరుద్దీన్కు శుక్రవారమే నిజామాబాద్ కోర్టు, అదిలాబాద్ కోర్టులు బెయిల్ ఇచ్చాయి. అయితే, ఈ రోజు ఉదయం అక్బర్ తరఫు న్యాయవాదులు ఆయన పాసుపోర్టు సరైన సమయంలో విచారణాధికారులకు ఇవ్వలేదు. దీంతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. అక్బరుద్దీన్ విడుదల ఆదేశాలను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం న్యాయవాదులు పాసుపోర్టు ఇవ్వడంతో విడుదలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అక్బరుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అదిలాబాదు జిల్లా సెషన్స్ కోర్టు మూడు షరతులతో కూడిన బెయిలును ఇచ్చింది. పాసుపోర్టును అప్పగించాలని, నిర్మల్ పట్టణంలో ప్రవేశించకూడదని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం షరతులు విధించింది. నిజామాబాద్ జిల్లా కోర్టు ఈ రోజు ఆయనకు రూ.10వేలు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది.