జగన్ పార్టీకి తెరాస షాక్: కాంగ్రెసుతో కలిసి హైడ్రామా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పక్కన పెట్టి కాంగ్రెసుతో కలిలి తెరాస రాజకీయం చేసింది. నిజామాబాద్ డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ముజిబుద్దీన్, వైయస్ చైర్మన్గా గెడ్డం రంగారెడ్డి ఎన్నికయ్యారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ రంగప్రవేశంతో సీను మారిందని అంటున్నారు.
ఇదిలావుంటే, కోరం లేకపోవడంతో చిత్తూరు డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో 11 డిసిసిబి డైరెక్టర్ స్థానాలను కాంగ్రెసు గెలుచుకుంది. మూడింటిని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. డిసిఎంఎస్ డైరెక్టర్ స్థానాల్లో మూడింటిని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఒక స్థానాన్ని కాంగ్రెసు గెలుచుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడానికి సరైన సంఖ్యలో సభ్యులు హాజరు కాకపోవడంతో మంగళవారంనాడు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఖమ్మం డిసిసిబి అధ్యక్ష అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి నిర్ణయం కోసం పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. కాగా, డిసిఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు బుధవారంనాటికి వాయిదా పడ్డాయి.
వరంగల్ డిసిసిబి అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికపై వరంగల్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చిస్తున్న సమయంలోనే అధిష్టానాన్ని ధిక్కరించి 11 మంది సభ్యులతో కలిసి అధ్యక్ష పదవికి జంగా రాఘవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంత మాధవరెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
కాగా, రంగారెడ్డి డిసిఎంఎస్ అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్ మధ్య వివాదం చోటు చేసుకుంది. డిసిసిబి అధ్యక్ష పదవికి లక్ష్మారెడ్డిని ఎంపిక చేయగా, డిసిఎంఎస్ అధ్యక్ష పదవికి ప్రసాద్ కుమార్ వర్గానికి చెందిన దారాసింగ్ అభ్యర్థిత్వాన్ని సబితా ఇంద్రారెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి, వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications