వాచీల్లో ఒదిగిపోయిన తిరుమల శ్రీవారు, విమర్శలు
శ్రీవారి బొమ్మలతో వాచీల మార్కెట్ను హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తిరుమలేశుడిని వాణిజ్యపరం చేయడాన్ని, పైగా విదేశీ సంస్థకు ఆ అవకాశం కల్పించడాన్ని విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అభ్యంతరాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం తోసిపుచ్చుతున్నారు.
స్వామివారి వైభవం ఆ విధంగా వర్ధిల్లుతుందని, దాన్ని వక్రీకరించి చూడవద్దని ఆయన అంటున్నారు అందరినీ భయబ్రాంతులను చేసే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ చర్యను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. శ్రీవారి గోపురం, విగ్రహం రూపాలతో వ్యాపారం చేయడం ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తగదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్దల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.
ఒక వాచీ తయారీ సంస్థ ప్రచారానికి స్వామివారి ప్రతిమలు వాడడం సరి కాదని ఆయన అన్నారు. దేవుడికి విలువ కట్టి వ్యాపారం చేస్తూ వాటికి ప్రయోజనాలు ముడిపెట్టడం ఇవోకు తగదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారితో వాచీల వ్యాపారం చేసే ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అని ఆయన అడిగారు.